Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు టాలీవుడ్‌లో మళ్లీ రాజుకున్న పర్సంటేజ్ వివాదం.!

టాలీవుడ్‌లో మళ్లీ రాజుకున్న పర్సంటేజ్ వివాదం.!

0
9


టాలీవుడ్‌లో మళ్లీ రాజుకున్న పర్సంటేజ్ వివాదం.!

Jul 7, 2026 5:56PM

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ను తీవ్రంగా వేధిస్తోన్న ఒకే ఒక్క సమస్య ‘పర్సంటేజ్ విధానం’. సినిమా కలెక్షన్లలో థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వచ్చే లాభాల వాటా గురించిన ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చింది. కొద్దిరోజుల క్రితం పెద్ది సినిమా విడుదలయ్యే ముందు ఈ పర్సంటేజ్ విధానం మీద ఎగ్జిబిటర్లు తీవ్రమైన హడావుడి చేశారు. ఆ సమయంలో పరిస్థితి చేజారిపోకుండా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. ఎగ్జిబిటర్లతో మాట్లాడి, ఈ సమస్యను తాత్కాలికంగా సద్దుమణిగించారు. తనకు కొంచెం సమయం ఇవ్వాలని, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని చిరంజీవి హామీ ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు కూడా వెనక్కు తగ్గారు. 

కానీ ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అనుకున్న సమయం దాటిపోవడంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా కలిసి నిన్న అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే కొందరు కీలక సభ్యులు వెళ్లి చిరంజీవిని మరోసారి కలిసినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో చిరంజీవి ఎగ్జిబిటర్ల బాధలను విన్నారని, ఈ సమస్యపై మరింత లోతుగా చర్చించేందుకు తనకు మరో వారం రోజుల సమయం కావాలని కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

అయితే ఈ పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల ఆలోచన మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్న ఈ పర్సంటేజ్ ఆలోచనను కనీసం ఒక ఏడాదిన్నర పాటు పక్కన పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే, రాబోయే ఈ ఏడాదిన్నర కాలంలో ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చేస్తాయి. ఆ క్రేజీ ప్రాజెక్టులన్నీ విడుదలైపోయిన తర్వాత, అంటే వచ్చే 2028 సంవత్సరం నుంచి ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసుకోవచ్చు అనేది నిర్మాతల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, నిర్మాతల ప్రతిపాదనను ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలం పాటు తాము ఆగితే, అప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు తట్టుకోలేవని, చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా మాయం అయిపోతాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి నిర్మాతల మదిలో ఉన్న అసలు ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. మరో ఏడాదిన్నర కాలం పాటు ఈ వివాదాన్ని సాగదీస్తే, ఈలోగా పట్టణాల్లో, నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరిగితే, అప్పుడు ఈ పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లతో వచ్చే తలనొప్పులు, డిమాండ్లు ఏవీ నిర్మాతలకు ఉండవు. ఈ పరిణామాలు గమనిస్తుంటే మొత్తం మీద ఈ పర్సంటేజ్ వివాదం ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. 

 

 

Tollywood, Percentage Controversy, Exhibitors, Chiranjeevi

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here